మూసి రివర్ ఫ్రంట్ నైట్ ఎకానమీగా అభివృద్ధి చేస్తాం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  పేర్కొన్నారు.

👉 హైదరాబాద్ శివరాంపల్లిలో పునరుద్ధరించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును ముఖ్యమంత్రి  ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ , అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ప్రజా ప్రతినిధులు, ఉన్నధికారులు పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ……

ప్రజలకు అద్భుతమైన సంస్కృతిని అందించడానికి బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని చెప్పారు. హైదరాబాద్‌లో చెరువులను పునరుద్ధరించిన ప్రాంతాల్లో నైట్ ఎకానమీ కొనసాగే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.


👉 “స్థానిక పౌరులకు మంచి వాతావరణం కల్పించాం. ఇక్కడ ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఉదయం, సాయంత్రం సమయాల్లో వాకింగ్ చేసుకోవడానికి ఇక్కడ లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అలాగే, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ లేక్స్ వద్ద స్టాల్స్ పెట్టి స్థానికులు పాలు, పండ్లు, కూరగాయలు పరిశుభ్రమైన వాతావరణంలో అమ్ముకోవడానికి వీలు కల్పిస్తాం.


👉 99 రోజుల ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హైదరాబాద్‌లో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఒకప్పుడు హైదరాబాద్ రాక్స్, లేక్స్ తో ప్రపంచంలోనే సుందరమైన నగరంగా ఉండింది. ఈ నగరం మనది. దీన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా అందరిపైన ఉంది. ఈ మహానగరానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలను తొలగించే కార్యక్రమం చేపట్టాం.


👉 ఇది ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ సిటీ. ఈ సిటీని అభివృద్ధి చేయడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టాం. రెండు రోజుల కిందట కొత్వాల్ గూడ ఎకో పార్క్ ను ప్రారంభించుకున్నాం. సాధ్యమైన తొందరగా మెట్రో విస్తరణ పనులను పూర్తి చేస్తాం. మిరాలం ట్యాంక్ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. పక్కనే హైకోర్టు నూతన భవన నిర్మాణం సాగుతోంది. ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నాం.


👉 హైదరాబాద్ అత్యంత పురాతన, ప్రాముఖ్యత కలిగిన నగరం. ఆ ప్రాభవం కోల్పోయే ప్రమాదం ఉంది. దీన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. బతుకమ్మ కుంటను అభివృద్ధి చేశాం. ఏడాది కిందట బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు ఎలా ఉంది. ఇప్పుడేలా ఉంది.


👉 ఈ ఒరిజినల్ సిటీని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను చూడండి. ఆ పనులను చూసి ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి… అని ముఖ్యమంత్రి ముస్లిం సోదర సోదరీమణులకు ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.