టీటీడీ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య కోసం ప్రత్యేక చర్యలు !

👉 టిటిడి జేఈవో డా. ఎ శరత్ !

J.SURENDER KUMAR,

టీటీడీ విద్యాసంస్థల్లో వచ్చే ఏడాది నుండి మరింత నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ సూచించారు. మంగళవారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో డీఈవో వెంకట సునీలు, టిటిడి కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాల్స్‌, హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, టిటిడి ఛైర్మన్  బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర మార్గదర్శకత్వంలో విద్యాసంస్థల్లో పలు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు జ్ఞానం, నైపుణ్యాలు, విలువలను పెంపొందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు కలిసి పని చేయాలని తెలిపారు.

విద్యార్థుల చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పర్యవేక్షణ  మార్గదర్శకత్వం, ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు. విద్యార్థులను వారి ప్రతిభ ఆధారంగా గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూపులో అన్ని రకాల విద్యార్థులు ఉండేలా చూసి, మంచి ప్రతిభ కలిగిన వారు ఇతరులకు సహాయం చేసే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.

విద్యార్థులకు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధించాలని, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఉపాధ్యాయులు పాఠాలు మరింత బాగా బోధిస్తే పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించవచ్చని తెలిపారు. అలాగే ఉపాధి ఆధారిత కోర్సులు, కొత్త విద్యా విధానంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సకాలంలో నవీకరించాలన్నారు . డిజిటల్ బోధన పద్ధతులు, స్మార్ట్ క్లాసులు ఉపయోగించాలని, ముందుగానే లెసన్ ప్లాన్ సిద్ధం చేసి బోధించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. 

విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ తో పాటు వారి పురోగతిని నిరంతరం నమోదు చేయాలన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించి, విద్యార్థుల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలన్నారు.

👉 డోలు విద్యార్థిని అభినందించిన జేఈవో !

ఎస్వీ మ్యూజిక్ కాలేజీకి చెందిన కె. ప్రదీప్ జాతీయ స్థాయి డోలు వాయిద్య పోటీల్లో ప్రథమ బహుమతి సాధించినందుకు జేఈవో అభినందించారు. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 150 విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రదీప్‌కు డోలు వాయిద్యంలో శిక్షణను హెచ్‌ఓడీ  వైఎల్. శ్రీనివాస్ అందించారు.

ఈ కార్యక్రమంలో  ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్జీఎస్ కళాశాల ప్రిన్సిపాల్  సత్యనారాయణ, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నారాయణమ్మ ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి భువనేశ్వరి, ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మావతమ్మ, ఎస్వీ మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమ ముద్దుల తదితరులు పాల్గొన్నారు.