ప్రతి గ్రామం పర్యటిస్తా ప్రజా సమస్యలు పరిష్కరిస్తా !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన –  ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎండపల్లి,  వెల్గటూర్ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటిల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

👉 ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత పార్టీలకు ఆతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి వచ్చి సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.


👉 ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు. వివిధ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న 78 మంది లబ్ధిదారులకు ₹ 25.40 లక్షల విలువైన చెక్కులను మంత్రి ఈ సందర్భంగా అందజేశారు. ముగ్గురు దివ్యాంగులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ లక్షలాది రూపాయలు విలువ గల స్కూటిలను  అందజేశారు.

👉 కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో  ఇటీవల రేబిస్ వ్యాధితో ఎనిమిదేళ్ల బాలుడు మణి తేజ మరణించగా బాలుడి తల్లిదండ్రులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం కోటిలింగాల గ్రామంలో పరామర్శించారు.

బాలుడి మృతి విషాదకరమని మంత్రి అన్నారు. ఈసందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృతం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.