ధాన్యం కొనుగోలుపై మంత్రి గంగుల కమలాకర్  వీడియో కాన్ఫరెన్స్ !

రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమస్య రాకుండా చర్యలు !


జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

J.SURENDER KUMAR,

జిల్లాలో రైతులు పండించిన పంటను ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు అలాట్ చేసిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష  సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, పౌర సరఫరాల కమిషనర్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోలు అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
.

ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పంట విస్తీర్ణం విపరీతంగా పెరిగిందని, ధాన్యం దిగుబడి బాగా పెరిగిందని, రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు తీసుకున్న చర్యల కారణంగా గత సంవత్సరం కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు.

గత సంవత్సరంలో 4.5 లక్షల రైతుల నుంచి 28 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, ఈ సంవత్సరం మే 23 నాటికి 6.4 లక్షల రైతుల నుంచి, 38 లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశామని. గత సంవత్సరం కంటే అధికంగా 450 కొనుగోలు కేంద్రాలు అదనంగా ప్రారంభించామని మంత్రి తెలిపారు.  జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం రైతులు నష్ట పోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలలో రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడికి స్థల సమస్య ఉందని, దీనివల్ల లారీల మూమెంట్, మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి ఆలస్యం అవుతుందని, దీనిని నివారించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇంటర్మీడియట్ గోడౌన్లో భద్రపరచాలని, జిల్లాలో ఇంటర్మీడియట్ గోడౌన్ లను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. రైస్ మిల్లుల వద్ద లోడింగ్, అన్లోడింగ్ సమస్య రాకుండా అధిక సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాల వారీగా అవసరమైతే లారీల సంఖ్యను పెంచాలని రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి తెలిపారు


వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష  మాట్లాడుతూ  జిల్లాలో రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమస్య రాకుండా అలాట్ చేసిన రైస్ మిల్లులు తప్పనిసరిగా ధాన్యం దిగుమతి చేసుకునేలా ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నామని, రైస్ మిల్లుల వద్ద స్థల సమస్య ఉంటే ప్రత్యామ్నాయ స్థలాల ఎంపిక చేపడుతామని, ప్రస్తుతానికి రైస్ మిల్లుల వద్ద అందుబాటులో ఉన్న స్థలంలో దాన్యం దిగుబడి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో దాన్యం కొనుగోలు కేంద్రాలకు అలాట్ చేసిన రైస్ మిల్లులకు తప్పనిసరిగా ధాన్యం పంపాలని, రైస్ మిల్లులలో ఉన్న స్థలంలో దాన్యం దిగుబడి చేసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ఆగకుండా ప్రతిరోజు జరిగే విధంగా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి లక్ష్మి నారాయణ,, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్, జిల్లా సహకార అధికారి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.