కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి !.
J.SURENDER KUMAR,
పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబీమా వర్తింపజేయాలి. రేషన్ కార్డుల్లో పేరు లేనందున బీసీ చేతివృత్తుల లక్ష సాయం పథకానికి గల్ఫ్ రిటనీలు దరఖాస్తు చేసుకోలేకపోయారు. రేషన్ కార్డుల నుండి గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగించడం వలన ఆరోగ్యశ్రీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని టిపిసిసి గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ లో విలేఖరుల సమావేశంలోమాట్లాడారు.
ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి గత 52 సంవత్సరాలుగా (1970 నుంచి) గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నీళ్లు – నిధులు – నియామకాలు & బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి… అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు మలేషియా, సింగపూర్, అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా తదితర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు. వీరందరి సంక్షేమం కోసం సమగ్ర ఎన్నారై పాలసీలో భాగంగా ‘గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేయాలి అంటూ డిమాండ్ చేశారు.
👉 గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
👉 అన్ని విద్యా సంస్థలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
👉 జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టాలి.
👉 హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
👉 ప్రవాస భారతీయ బీమా యోజన (PBBY) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణంను కూడా చేర్చాలి. రూ.325 చెల్లిస్తే రెండు సంవత్సరాల కాలపరిమితితో ఇన్సూరెన్స్ ఇస్తారు. పాస్ పోర్ట్ స్టేటస్ తో సంబంధం లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయాలి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
👉 ఎమిగ్రేషన్ యాక్టు-1983 ప్రకారం… గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి సర్వీస్ చార్జీగా అభ్యర్థి యొక్క 45 రోజుల వేతనం (రూ. 30 వేలకు మించకుండా) మాత్రమే ఏజెంటుకు చెల్లించాలి. దీనిపై 18 శాతం జీఎస్టీ అనగా రూ.5,400 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ని పూర్తిగా రద్దు చేయాలి.
👉 ఎన్నారైలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా వినియోగించుకునేలా తక్షణమే చర్యలు వేగవంతం చేయాలి.
👉 విదేశాల నుండి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కార్మికుల నైపుణ్యం మరియు అనుభవాన్ని ఉపయోగించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలి.
👉 జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) ఇవ్వాలి.
ఉంటూ పలు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బి. ఎం. వినోద్ కుమార్, ఎన్నారైలు గంప వేణుగోపాల్, రాజశేఖర్ రెడ్డి, రాఘవేందర్, విష్ణువర్ధన్, గాల్ రెడ్డి, చాంద్ పాషా పాల్గొన్నారు.