రైతు కూలీ సంఘం నుంచి.. మావోయిస్టు పార్టీగా!!
వార్ కు ఈ యాత్ర పాఠశాల, ప్రయోగశాల!!
నాటి నిర్వాహకులే.. నేటి అగ్రనేతలు!!
42 సంవత్సరాల క్రితం జగిత్యాల పట్టణ నడిబొడ్డున 1978 సెప్టెంబర్ 9న లక్షలాది మంది రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ , జగిత్యాల జైత్రయాత్ర గా ,పీపుల్స్ వార్ ,మావోయిస్టు పార్టీల ఉద్యమాలకు పాఠశాలగా, ప్రయోగశాలగా ఉపకరించింది అని చెప్పవచ్చు. అనంతరం రైతు కూలీ సంఘాలు . పీపుల్స్ వార్ ,గా మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది అని చెప్పవచ్చు. నాటి ఈ జైత్ర యాత్ర నిర్వాహకులు కొందరు ఎన్కౌంటర్లో మృతి చెందగా మరికొందరు లొంగిపోగా కొందరు నేటికీ మావోయిస్టు అగ్రనేతలు గా కొనసాగుతున్నారు

వివరాల్లోకి వెళితే ….1975 నాటికి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భూస్వాములు, దొరలు ,పటేల్, పట్వారి ల దౌర్జన్యాలు వర్ణనాతీతం గా ఉండేవి. వారి ఆగడాలను ప్రశ్నించే వారిని గ్రామ చావడిలో ప్రజల ముందు కఠినంగా శిక్షించే వారు కొన్ని సందర్భాల్లో వారిని గ్రామం నుంచి వెలి వేసేవారు భూ తగాదాలు ,కుటుంబ తగాదాలు ,భార్యాభర్తల గొడవలు పరిష్కారం గ్రామపెద్దలే పరిష్కరించాలి. తమ సమస్యలు గొడవలు పరిష్కారం కోసం ఇరువర్గాలు (తగాదా పడిన వారు) సమస్య పరిష్కారం కోసం గ్రామంలోని పంచాయతీ పెద్దల వద్ద వేలాది రూపాయలు డిపాజిట్ చేయాల్సింది దీనిని ధడువత్ అంటారు. గ్రామ పెద్దల ఇష్టానుసారం ఇష్టమైన రోజున పంచాయతీలు తీర్పులు చెప్పి పరిష్కారం చేసేవారు . తప్పొప్పులను, న్యాయాన్యాయాల ను ,ప్రశ్నించే సాహసం ఇరువర్గాలు చేయకూడదు .న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కానీ ,న్యాయస్థానాలు కానీ వెళ్ళవద్దు. ఇది గ్రామ పెద్దలు హుకుం. ధరావత్ చేసిన సొమ్మును బాధితులు తిరిగి పొందే వారు కాదు. ఈ సొమ్ము పంచాయతీ పెద్దలు విందు వినోదాల కే ఖర్చుల పేరిట వారు తీసుకునే వారు. నాటి పరిస్థితుల లో వ్యవసాయ కూలీ పనులు, నాట్లు, కలుపు ,దున్నడం ,విత్తనాలు వేయడం, ఇంటి పనులు, రజక ,నాయిని ,గ్రామ సేవకులు, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం గ్రామ పెద్దలకు వెట్టి గా ( ఉచితంగా సంవత్సరాల తరబడి చేసేవారు )చేయాల్సిందే. ఈ తరుణంలో కొండపల్లి సీతారామయ్య వర్గం కు చెందిన యువకులు గ్రామ గ్రామాన తిరుగుతూ అనగారిన గారిన, బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యవంతుల్ని చేసి రైతు కూలీ సంఘాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేశారు. వెట్టిచాకిరి నిర్మూలన ,పాలేరు లకు జీతాలు పెంచాలి ,పశువుల కాపరులకు జీతాలు చెల్లించాలి, దున్నేవాడిదే భూమి, అంటూ వారి లో చైతన్యం రగిలించి గ్రామ పెద్దల ఇళ్లలో ఉచితంగా (వెట్టి గా చేసే పనిని ) బందు పెట్టించారు.రైతు కూలీ సంఘాల ఐకమత్య ప్రదర్శన కోసం జగిత్యాల పట్టణంలో పాత బస్టాండ్ సమీపాన గల ప్రభుత్వ కళాశాల మైదానంలో బహిరంగ సభ ను కొండపల్లి సీతారామయ్య వర్గం వారు 1978 సెప్టెంబర్ 9న ఏర్పాటు చేశారు. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ ,నిజామాబాద్ ,వరంగల్ జిల్లా లో కొంత భాగం రైతుకూలీ సంఘాలను సభ్యులను . వారి ఆధ్వర్యంలోనే ప్రజలను తరలించడానికి పక్కాగా కార్యాచరణ పథకాన్ని నిర్వాహకులు సిద్ధం చేశారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం భూమికోసం, భుక్తికోసం ,బానిస బతుకుల విముక్తి కోసం ,వెట్టిచాకిరి నిర్మూలన కోసం ,దున్నేవాడిదే భూమి ,వ్యవసాయ కూలీల, ధరలు పెంచాలని ,తదితర డిమాండ్లతో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు గ్రామాల్లో ప్రచారం చేశారు. దాదాపు మూడు లక్షలకు పైగా రైతుకూలీలు ఈ సభకు తరలివచ్చారు. ఎలాంటి వాహన సౌకర్యాలు, రహదారులు ,వసతి సౌకర్యాలు ,సమాచార వ్యవస్థ లేని ,తరుణంలో జరిగిన ఈ బహిరంగ సభకు జగిత్యాల జైత్రయాత్ర నామకరణం చేశారు..మల్లోజుల కోటేశ్వరరావు ,శీలం నరేష్ ,నల్లా ఆదిరెడ్డి, ముంజల రత్నయ్య, ఖైరి గంగారాం, మాదాసు వేణుగోపాల్ ,బద్దం శంకర్ రెడ్డి , సాయి ని ప్రభాకర్, ముప్పాళ లక్ష్మణ రావు ,తుషార్ భట్టాచార్య, విశ్వేశ్వరరావు ,కల్లూరి నారాయణ ,చిరంజీవి ,డాక్టర్ రవీంద్రనాథ్ ,పోశెట్టి, లంక పాపిరెడ్డి ,మల్ల రాజిరెడ్డి ,తదితరులు గ్రామ గ్రామాన తిరుగుతూ జనసమీకరణ చేపట్టినట్టు మాజీలు వివరిస్తుంటారు.ముక్కు సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రజా యుద్ధనౌక గద్దర్ గజ్జ కట్టి వేదికపై ఆడి పాడి సభికులను ఉర్రూతలూగించరు. ఈ సభలో లో రైతు కూలీల సమీకరణాలతో అనగారిన వర్గాలు ప్రశ్నించే దమ్ము ధైర్యం వచ్చాయనేది వాస్తవం .అది నేటికీ కొనసాగుతున్న చర్చ. దీంతో ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు మార్చిన జైత్రయాత్ర గా విశిష్ట స్థానం ఉందనే చర్చ నేటికి ఉంది. ఇదే సమయంలో జిల్లాలో మానవహక్కుల సంఘాలు, విప్లవ రచయితల సంఘాలు , దళిత సాహిత్యం,పురుడు పోసుకున్నాయి అన్ని రంగాలలో అణిచివేతకు గురైన ఈ ప్రాంతం పల్లె ప్రజలు తమపై జరుగుతున్న దాడులను చేసిన పనికి కూలీ చెల్లించండి అని ప్రశ్నించే దమ్ము ధైర్యం జైత్రయాత్ర ప్రసాదించిందని విషయం జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 978- 79 సంవత్సరంలో ఈ ప్రాంతంలో కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి పోలీసు బలగాలను గ్రామ గ్రామాలలో దించింది క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రైతు కూలీ సంఘం సభ్యులు గెరిల్లా దళాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో మిలిటెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి టార్గెట్లను గ్రామ బహిష్కరణ ,భూములు దున్న కపోవడం, పాలేరు లను బంధు పెట్టించడం ,ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించు కుంటూ , 1980 లో కొండపల్లి సీతారామయ్య వర్గం ఈ ఉద్యమానికి “” పీపుల్స్ వార్ “” గా నామకరణం చేసి ఉద్యమాన్ని విస్తరింప చేసుకుంది. చత్తీస్గర్ బీహార్ బెంగాల్ ఒరిస్సా మిడ్నాపూర్ మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో పట్టు సాధించిన పీపుల్స్ వార్. నాటి జైత్రయాత్ర నిర్వాహకులే 2004 సంవత్సరం లో సెప్టెంబర్ లో బీహార్ మావోయిస్టు పార్టీ తో ఒప్పందం చేసుకుని “” మావోయిస్టు పార్టీ “” గా రూపాంతరం చెంది ఆ పార్టీ అగ్రనేత లు గా కొనసాగుతున్నారు. అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా తమ ప్రాబల్యం గల ప్రాంతాలలో తాము అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళికకు జగిత్యాల జైత్రయాత్ర మాకు స్ఫూర్తి అని మా ఉద్యమానికి ఓ పాఠశాల అని ,అదే మాకు ఉద్యమ ఉద్ధృతికి ప్రయోగశాల అంటూ పాత్రికేయులతో సంభాషించిన అనేక సందర్భాల్లో, జనజీవన స్రవంతిలో కలిసిన మాజీమావోయిస్టు నాయకులు వివరించడం గమనార్హం..