J.SURENDER KUMAR,
ఫ్యూచర్ సిటీ, శామీర్పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర వివరణాత్మక ప్రణాళికలు (డీపీఆర్లు) మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు మెట్రోల డీపీఆర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ చివరి వారంలో టెండర్లు పిలవాలని సీఎం సూచించారు.
👉 హైదరాబాద్ నగరంలో మెట్రో (Metro) విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
👉 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – ఫ్యూచర్ సిటీ మెట్రో (40 కి.మీ.), జేబీఎస్ – శామీర్పేట మెట్రో (22 కి.మీ.), ప్యారడైజ్ – మేడ్చల్ మెట్రో (23 కి.మీ.) మార్గాలకు సంబంధించి భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

👉 ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎలైన్మెంట్ రూపొందించేటప్పుడే క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలి.
👉 మేడ్చల్ మార్గంలో ఎన్హెచ్ మార్గంలో ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాలి. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలి.
👉 శామీర్పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభమయ్యేలా చూసుకోవాలి. అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలి.
👉 జంక్షన్కు సంబంధించిన పూర్తి ప్రణాళికను తయారు చేయాలి. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ( HGCL ) కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలి.
👉 సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ తదితరులు పాల్గొన్నారు.