👉 కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరణ పై !
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) పర్యవేక్షణలో అందించే సిఫారసులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరణ చర్యలు చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
👉 మేడిగడ్డ కుంగిపోయిన మరుసటిరోజున మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేయబడింది. 2023 అక్టోబర్ 22 న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు పరిస్థితిని పరిశీలించి ప్రాజెక్టు డిజైన్, ప్లానింగ్, నాణ్యత, నిర్మాణం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలను ఎత్తిచూపుతూ ఆ కారణంగానే మేడిగడ్డ కుంగిపోయిందని ప్రాథమిక నివేదిక అందించారు” అని చెప్పారు.
👉 బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, డిజైన్లు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో గేట్లు మూసి బ్యారేజీల్లో నీటిని నిలువచేయడం వల్ల ప్రమాదం పొంచి ఉందని ఎన్డీఎస్ఏ సూచనల మేరకే నీటిని ఎత్తిపోయడం లేదని చెప్పారు.
👉 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
👉 కాళేశ్వరం ప్రాజెక్టు – మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వచేసి ఎత్తిపోయడానికి వీలులేని పరిస్థితులు, ఎన్ డీఎస్ఏ నివేదిక అంశాలను ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు.
👉 “కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధరించే విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2026 జూన్ 30 న టెక్నికల్ ఓవర్సైట్ కమిటీని నియమించింది. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, పునరుద్ధరణ అంశాలపై ఆ కమిటీ ప్రతిపాదనలకు లోబడి జరగాలని నిర్ధేశించారు.
👉 ఎన్డీఎస్ఏ (టెక్నికల్) సభ్యుడు చైర్మన్గా, సీడబ్ల్యూసీ (డిజైన్స్ – బీసీడీ) డైరెక్టర్, సీడబ్ల్యూసీ (డిజైన్ – గేట్స్) డైరెక్టర్, ఎస్ఎంఆర్ఎస్ నుంచి ఎస్ఈ స్థాయికి తగ్గకుండా ఒక ప్రతినిధి, సీడబ్ల్యూపీఆర్ఎస్ నుంచి ఎస్ఈ స్థాయికి తగ్గకుండా ఒక ఇంజనీర్, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎస్ఈ స్థాయికి తగ్గకుండా ముగ్గురు ప్రతినిధులు ఉండే విధంగా టెక్నికల్ ఓవర్సైట్ కమిటీని ఏర్పాటు చేశారు.

👉 ఈ కమిటీ తెలంగాణ ప్రభుత్వ నిపుణులు, ఈ రంగంలో జాతీయ అంతర్జాతీయ నిపుణులతో పాటు ఇతరేతర నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకుంటుందని ఆ కమిటీని నియమిస్తూ జలశక్తి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను నిర్దేశించింది” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
👉 “ఎన్డీఎస్ఏ తుది నివేదికను పరిగణలోకి తీసుకుని టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ సూచనలను తూ.చ తప్పకుండా పాటించి అందుకు అనుగుణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
👉“ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీల్లో నీటిని నిలువచేయడానికి ఏమాత్రం సహేతుకం కాదని ఎన్డీఎస్ఏ తన నివేదికలో చాలా స్పష్టంగా తెలిపింది. ప్రస్తుత సమస్యలతో పాటు పరిష్కారానికి అవసరమైన సూచనలు అన్నీ చేసింది.. అని చెప్పారు. ఆ నివేదికను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టును పునరుద్ధరించడానికి నిపుణుల కమిటీ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది” అని అన్నారు.
👉 నీరు పారుతున్నప్పటికీ గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయడం లేదని, ఆ విషయంలో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని, బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నందునే ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలు తెలియజేస్తున్నాం అని వివరించారు. ఈ విషయంలో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపిస్తూ, ఎన్డీఎస్ఏ సూచనలను పరిగణలోకి తీసుకుని మాట్లాడితే బాగుండేదని వ్యాఖ్యానించారు.
👉 “గోదావరి నదిలో నీళ్లు పారినంత మాత్రాన ఎత్తిపోయడానికి వీలుకాదు. అందుకు బ్యారేజీలు ఏమాత్రం అనుకూలం కాదు. నీటిని ఎత్తిపోయాలంటే ముందు నీటిని నిల్వచేయాలి. నిలువ చేయకుండా నీటిని ఎత్తిపోయడానికి అవకాశమే లేదు. పారుతున్న గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయడానికి బ్యారేజీలు ఎందుకు? అని ప్రశ్నించారు.
👉 “దేశంలోని ప్రాజెక్టులు, డ్యామ్ల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 30 న పార్లమెంట్ ద్వారా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ను తెచ్చింది. ఈ అథారిటీ దేశ వ్యాప్తంగా ఎక్కడైనా సరే డ్యామ్ల తనిఖీలు, పర్యవేక్షణ, నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి తగిన యంత్రాంగంతో చట్టం రూపొందించారు.
👉 ఇలాంటి సందర్భాల్లో ఏ రాష్ట్రమైనా ఎన్డీఎస్ఏ ఆదేశాలు, సూచనలు పాటించాల్సిందే. 2023 లో మేడిగడ్డ ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే ఎన్డీఎస్ఏ పర్యటించి ప్రాథమిక నివేదిక అందించింది. ఆ తర్వాత పూర్తి స్థాయి నివేదికను అందించింది.
👉 మేడిగడ్డ 7వ బ్లాక్ వద్ద బ్యారేజీ పిల్లర్లు 1.2 మీటర్లు కుంగిపోయింది. ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాల కారణంగానే ఆ ప్రమాదం ఏర్పడిందని చాలా స్పష్టంగా నివేదికలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యారేజీల్లో నీటిని నింపితే ప్రమాదకరమని ఎన్డీఎస్ఏ తన 365 పేజీల నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది.
👉 ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలలో నీటిని నింపడానికి పనికి రావు. మేడిగడ్డ 7వ బ్లాక్ డ్యామేజీ కావడం వల్ల మొత్తం బ్యారేజీపై ప్రభావం చూపించి దెబ్బతిన్నదని, ఆ కారణంగా నీటి నిల్వ సాధ్యం కాదని తేల్చింది.
👉 ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి మూడు బ్యారేజీల స్థిరీకరణ, పునరుద్ధరణకు, సమగ్రమైన అంచనాలు అవసరమని ఎన్డీఎస్ఏ తన ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో తేల్చిచెప్పింది. మొత్తం ప్రాజెక్టు పునరుద్ధరించాలంటే డిజైన్లు, మరమ్మతులు ఎన్డీఎస్ఏ లేదా సీడబ్ల్యూసీ ఆమోదంతో మాత్రమే చేయాలని స్పష్టంగా చెప్పింది” అని ముఖ్యమంత్రి స్పష్టంగా వివరించారు.
👉 “నీటిని ఎత్తిపోయడానికి పంపులు పనిచేయాలంటే మేడిగడ్డ బ్యారేజీ వద్ద 93.5 మీటర్ల మేరకు నీటిని నింపాలి. అప్పుడే పంపులకు నీటిని నింపడానికి వీలవుతుంది. నీటిని ఎత్తిపోయడానికి నిరంతరంగా ఆ స్థాయిలో బ్యారేజీలో నీటిని నిలువ చేయాలి. కనీసం 5 టీఎంసీల నీటిని నింపినప్పుడే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారంలో పోయాలి.
👉 బ్యారేజీల్లో నీటిని నిలువ చేయాలంటే గేట్లు మూయాలి. గేట్లు మూస్తే మొత్తం బ్యారేజీకే ప్రమాదం పొంచి ఉందని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. పైగా బ్యారేజీ గేట్లపైన హైడ్రాలిక్ ఒత్తిడిని తట్టుకునే పరిస్థితి లేనందున, మరమ్మత్తులు చేసే వరకు గేట్లు మూయొద్దని, అన్ని గేట్లను ఎత్తిపెట్టాలని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది” అని తెలిపారు.
👉 “గేట్లు మూయలేని పరిస్థితి ఉన్నప్పుడు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్లు అన్నారం నుంచి తిరిగి మేడిగడ్డకే చేరుకుంటాయే తప్ప ప్రయోజనం లేదు. అన్నారం 116.5మీటర్ల ఎత్తున నిల్వచేసి ఎత్తి, సుందిళ్లలో పోస్తే సుందిళ్ల బెడ్ లెవల్ 126.5 మీటర్లు మేరకు దాదాపు 20 మీటర్ల ఎత్తు నీటిని నిల్వచేయాలి.
👉 ఇలా ఒకదానిపై ఇంకొకటి ఆధారపడి, నీటిని నిల్వ చేయకుండా ఎత్తిపోయడం అసలు సాధ్యం కాదు. గేట్లు మూసి నీటిని నిల్వచేయడం వల్ల ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదం ఉండొచ్చు. భద్రాచలం పట్టణం వరదలతో ముంచెత్తవచ్చు. ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది” అని హెచ్చరించారు.
👉 “నిజానికి ఈ ప్రాజెక్టుకు ప్రాణవాయువు, గుండెకాయ శ్రీపాద ఎల్లంపల్లి. గుండెకాయతో ఇప్పుడు ప్రాజెక్టు సాగుతోంది. 2019 జూన్ 21 న కాళేశ్వరం ప్రారంభిస్తే, ప్రాజెక్టు పూర్తి కాకముందే, 2020 మే 18 ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇందులో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దకుండా నిర్మాణాలు చేపడితే బ్యారేజీకే ప్రమాదం ఉందని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి లేఖ రాశారు. (లేఖలోని అంశాలను చదివి వినిపించారు) ప్రాజెక్టును ప్రారంభించిన 11 నెలల్లోనే లోపాలు ఉన్నాయని తెలిపారు” అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
👉 “ఆ లోపాలను సరిదిద్దకపోవడం, పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగా మేడిగడ్డ కుప్పకూలింది. దీనికి ముందు 2022 జూలై 14 న గోదావరి పోటెత్తిన సమయంలో రిటెయినింగ్ వాల్ కూలి కన్నెపల్లి పంప్హౌజ్ పూర్తిగా మునిగిపోయి దెబ్బతిన్నది. ఆ పంప్హౌజ్ను ఇప్పటికీ నూటికి నూరు శాతం సరిదిద్దలేదు.
👉 “ప్రాజెక్టు పునరుద్ధరణకు నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ, ఎన్డీఎస్ఏ సిఫారసులను పాటించాలన్న సూచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వారి పర్యవేక్షణలో ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాం. నిపుణుల పర్యవేక్షణలో ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం.
👉 ప్రాజెక్టు పునరుద్ధరణ విషయంలో మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ నెలలో టెస్టింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ముంబయ్ ఐఐటీ, అంతర్జాతీయ నిపుణుల సూచనల మేరకు పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తాం. ఈ విషయంలో ఎన్డీఎస్ఏకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది” అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు.
