👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా పరీక్షించిన స్కైరూట్ ఏరోస్పేస్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మిషన్ ఆగమన్లో భాగంగా నిర్వహించిన విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయం భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
👉 హైదరాబాద్కు చెందిన స్పేస్-టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన ఈ విజయం దేశం అంతరిక్ష సాంకేతిక రంగంలో సాధిస్తున్న పురోగతికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. అంతరిక్ష అన్వేషణలో భారత యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే ఘనత స్కైరూట్కు దక్కిందని ప్రశంసించారు.
👉 ఈ ఏడాది ఏప్రిల్లో శంషాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో ఉన్న స్కైరూట్ ఏరోస్పేస్ మ్యాక్స్-క్యూ క్యాంపస్ను సందర్శించిన సందర్భంగా, మిషన్ ఆగమన్ ప్రయోగ కార్యక్రమానికి ముందు విక్రమ్-1 ఫ్లైట్ హార్డ్వేర్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విక్రమ్-1 విజయవంతమైన టెస్ట్ ఫ్లైట్ తెలంగాణను ప్రపంచ స్థాయి ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో మరో కీలక మైలురాయిగా నిలిచిందన్నారు.
👉 ఈ విజయం ద్వారా ఏరోస్పేస్ ఆవిష్కరణలు, అధునాతన తయారీ రంగం, తదుపరి తరం అంతరిక్ష సాంకేతికతల అభివృద్ధికి తెలంగాణ అనువైన గమ్యస్థానంగా మరింత బలపడిందని ముఖ్యమంత్రి తెలిపారు. స్కైరూట్ వంటి సంస్థల విజయాలు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతలో శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించి, భావితర ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తాయని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
