ఆహార కల్తీల నిరోధానికి కఠిన చట్టాలు !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J SURENDER KUMAR,


ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు అన్నీ కల్తీ అవుతుండటంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA) పై ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో శనివారం ముఖ్యమంత్రి  సమీక్ష నిర్వహించారు.

👉 ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వినియోగిస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ముఖ్యమంత్రి  తెలిపారు.

👉 ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగంతో పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు బయట పడుతున్నాయని, దీంతో కొన్ని దేశాలు దిగుమతులకు నిరాకరిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి  ప్రస్తావించారు.

👉 మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో పలు రకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారని, అధిక ధరలు చెల్లించి ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నప్పటికీ అవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సరైన వ్యవస్థలు లేవని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

👉 కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు అమలులో ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి  అధికారులకు సూచించారు. ఆయా అధ్యయనాల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించి శాసనసభలో సమగ్ర చర్చ చేపడతామని ముఖ్యమంత్రి  తెలిపారు. శాసనసభలో చర్చతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించాలని సూచించారు.

👉 కల్తీలకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించేందుకు విజిల్ బ్లోయర్ వ్యవస్థను, టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు.

👉 కల్తీల నిరోధానికి ముందుగా క్యూర్ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించారు. అక్కడ నిబంధనలను అమలు చేసి, వాటి అమలులో ఎదురయ్యే లోటుపాట్ల ఆధారంగా ముందుకు సాగాలని సూచించారు.

👉 ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ , ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు , ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి , ఎన్.శ్రీధర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.