ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తా !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  !


J.SURENDER KUMAR,


ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.

ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలని, ఈ అంశాన్ని రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫీల్డ్ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న తమకు పే స్కేల్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని  వారు విజ్ఞప్తి చేశారు.

👉 వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా  స్పందిస్తూ ….

ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. వారి సమస్యలను క్యాబినెట్‌లో చర్చించి ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అన్ని విధాలా న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని మంత్రి అన్నారు.


అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై తన లెటర్ ప్యాడ్‌పై ముఖ్యమంత్రి కి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కి, పంచాయతీరాజ్ కమిషనర్ కు ప్రత్యేకంగా లేఖలు రాస్తానని మంత్రి  వారికి హామీ  ఇచ్చారు.


మంత్రిని కలిసిన వారిలో  జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు గడ్డం రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం రాజా గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు గౌడికర్ శ్రీనివాస్, గోనెపల్లి మహేష్, సాతర్ల బాలరాజ్, మార్కాపురం అశోక్, మామిడి అనిత, మల్లేశం రవి, సుజాత, శ్రీనివాస్, లక్ష్మణ్, ప్రకాష్, భీమన్నతో పాటు అన్ని మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.