పుష్కరాల పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి !

👉 క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యక్షుడు మంత్రి శ్రీధర్ బాబు !


J.SURENDER KUMAR,


2027 లో రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా కనివిని ఎరుగని రీతిలో కుంభమేళా తరహాలో నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, అందుకు అనుగుణంగా వచ్చే సంవత్సరం 2027  ఏప్రిల్ నాటికి పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుని సమష్టిగా ముందుకెళ్లాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.


👉 గత పుష్కరాల్లో తలెత్తిన సమస్యలు, ఇబ్బందులు ఈసారి పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.


👉 శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహించిన “గోదావరి పుష్కరాలు – 2027” కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ప్రముఖ దేవాలయాల వద్ద అభివృద్ధి పనులు, ఘాట్ల నిర్మాణం, రవాణా, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్ల పురోగతిపై సమీక్షించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…

పుష్కర ఏర్పాట్లలో సమన్వయ లోపం తలెత్తకుండా జిల్లాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

👉 భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన అదనపు ఏర్పాట్లపై ఘాట్ల వారీగా ప్రత్యేకంగా కలెక్టర్లతో క్షేత్రస్థాయి అధ్యయనం చేయించామన్నారు. పుష్కరాలు మొదలయ్యే నాటికి పూర్తయ్యే అవకాశమున్న పనులకే తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

👉 చివరి వరకూ వేచి చూడకుండా గ్రౌండ్ రియాల్టీకి అనుగుణంగా ప్రతి పనికి ఒక నిర్దేశిత గడువును విధించుకోవాలని ఆదేశించారు. ఆయా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌బోర్డ్‌ను వెంటనే అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు.

👉 ఇంజినీర్ల కొరత తలెత్తకుండా ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలన్నారు. పుష్కరాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని చెప్పారు. భద్రాచలం వద్ద ఎస్‌టీపీ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.

👉 ఎన్ని నిధులనైనా కేటాయించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని, పుష్కర ఏర్పాట్లు, పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని తేల్చి చెప్పారు.