లొంగిన మావోయిస్టులకు  గిరిదర్శకులుగా నియామకం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,

అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి మావోయిస్టులను సమాజంలో భాగస్వామ్యం చేయాలన్న వినూత్న ఆలోచనతో 20 మంది మాజీ మావోయిస్టు గిరిజన యువతకు గిరిదర్శకులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తొలి విడతగా ఎంపిక చేసిన వారికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు.

👉 భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు భూమి పూజ నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా 20 మంది గిరిజన యువతకు ఈ నియామక పత్రాలను అందించారు. వారికి జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో శిక్షణ ఇచ్చి వారిని గిరిదర్శక్ (టూరిస్ట్ గైడ్) లుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నియమించారు.


👉 తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యంగా పోలీసు, గిరిజనాభివృద్ధి, పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులకు సహాయపడేలా శిక్షణనిచ్చారు.


👉 తొలి విడతగా ఎంపిక చేసిన 20 మంది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు సహాయంగా ఈ గిరిదర్శక్‌లు పనిచేస్తారు. పర్యాటకులకు వారు స్థానిక సంస్కృతి, చరిత్రను వివరిస్తారు. అటవీ నియమాలు పాటించేలా చూడటంతో పాటు పర్యాటకులకు అవసరమైన భద్రత కల్పించడంలో ఈ గిరిదర్శక్‌లు సహాయంగా నిలుస్తారు.


👉 గిరిజన యువతను సమాజంలో భాగస్వామ్యం చేయడం, వారిలో మనోధైర్యం కల్పించాలన్న సంకల్పంతో సమగ్ర పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేయడం, గతంలో తీవ్రవాద ప్రభావం ఉన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వారిని ఆ ప్రాంతంలో నియమించారు.


👉  గిరిదర్శక్‌లు ప్రత్యేక యూనిఫామ్‌ల్లో విధులను నిర్వర్తిస్తారు. ఒకప్పుడు మావోయిస్టులకు దారి చూపిన వాళ్లు ఇకనుంచి పర్యాటకులకు దారి చూపిస్తారు.
గిరిదర్శకులుగా ఎంపిక చేసిన వారికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 6 నెలల పాటు సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇప్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  సూచించారు. సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వాలని, శిక్షణ కాలంలో వారికి స్కాలర్‌షిప్ అందించాలని చెప్పారు.