అందెశ్రీ నాకు ఆత్మబంధువు సీఎం రేవంత్ రెడ్డి !

👉 అందెశ్రీ  జయంతి సందర్భంగా స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమంత్రి  శంకుస్థాపన !


J . SURENDER KUMAR,


“అందెశ్రీ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కవిగా, గాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయం ఉండొచ్చు.. కానీ నాకు మాత్రం ఉద్యమకారుడే కాదు.. అందెశ్రీ నాకు ఒక ఆత్మబంధువు” అని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అన్నారు.. “అందెశ్రీ గానంలో ఉన్న గొప్పతనం, వారి గళంలో ఉన్న స్ఫూర్తి.. ఈనాడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానంటే… ఆ స్ఫూర్తి నాలో రగిల్చిన మాట నిజం..” అని భావోద్వేగంతో చెప్పారు.

👉 తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ  జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో వారి స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

👉 అందెశ్రీ కి పుష్పాంజలి ఘటించారు. భార్య మల్లుబాయి , కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ కుమారుడు దత్తుల సమక్షంలో స్మతివన నిర్మాణానికి ముఖ్యమంత్రి  భూమి పూజ నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ…..


,“కవి, గాయకుడు, ఉద్యమకారుడు.. నాకు ఆత్మబంధువుగా మారాడు. నా కుటుంబ సభ్యుడయ్యారు. మా కుటుంబంలో మేం ఏడుగురం అన్నదమ్ములం. నేను నాలుగో వాడిని. నాకు మా పెద్దన్ననే స్పూర్తి. తమ్ముడు ఒక స్థాయిలో ఉండాలని మా అన్న ఎన్నో కలలు గన్నడు. నేను ఎదుగుతున్న క్రమంలో నేను మా అన్నను కోల్పోయా. ఆ తర్వాత నాకు కనిపించిన పెద్దన్న అందెశ్రీ” అని చెప్పారు.

👉 ఈ సందర్భంగా అందెశ్రీ తో జరిగిన పరిచయ ప్రస్థానం, సాన్నిహిత్యాన్ని ముఖ్యమంత్రి  గుర్తుచేసుకున్నారు. తెలంగాణ గడ్డపైన ఆధిపత్యం ప్రదర్శించాలనుకున్నప్పుడు, ఈ తెలంగాణను ఆక్రమించుకుని దోచుకోవాలనుకుంటే ఏ తరమైనా అందెశ్రీ మళ్లీ పుడుతాడని హెచ్చరించారు.

👉 “అందెశ్రీ స్పూర్తి మన గుండెల్లో నిత్యం కొలువై ఉంటుంది. ఒక స్ఫూర్తి ప్రదాతగా అందెశ్రీ అందరి గుండెల్లో ఉంటారు. అందెశ్రీ స్ఫూర్తే ప్రజా ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. అందెశ్రీ, గద్దర్ స్ఫూర్తితో ప్రభుత్వం ఉంటుంది” అని పేర్కొన్నారు.

👉 తెలంగాణ ఉద్యమంలో రెక్కలు ముక్కలు చేసుకొని.. గొంతుని, జీవితాలను ఉద్యమానికి అంకితం చేసిన 9 మందిని గుర్తించి .. పార్టీని, జెండాను చూడకుండా.. సత్కరించి ప్రతి కుటుంబానికి రూ. కోటి అందజేశాం. ఇది నా సొమ్ము కాదు. ప్రజల సొమ్ము అని చెప్పారు.

👉 అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ.. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. వంటి ఎన్నో పాటలు.. అవి పాటలు కాదు. తూటాలై.. ప్రజా వ్యతిరేక పాలకుల గడీలను కుప్పకూల్చే మహా ఫిరంగులై పేలాయని ముఖ్యమంత్రి  అందెశ్రీ ని స్మరిస్తూ పేర్కొన్నారు.

👉 పదాలపై పదాలు పేర్చి తెలంగాణ ప్రజల గుండెళ్ల్లో అందెశ్రీ రగిల్చిన ఉద్యమ స్ఫూర్తి, ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డను ఉద్యమంవైపు నడిపించిన ఉద్యమకారుడని స్మరించుకున్నారు.

👉 రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024 జూన్ 2వ తేదీన జయ జయహే తెలంగాణ.. గీతాన్ని రాష్ట్ర గీతంగా జాతికి అంకితం చేసిన సందర్భంలో అందెశ్రీ  భావోద్వేగానికి లోనైన సందర్భాన్ని ముఖ్యమంత్రి  ప్రస్తావించారు.