ఫుట్‌బాల్ మ్యాచ్‌ తిలకించిన సీఎం రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


ఫీఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  విద్యార్థులతో కలిసి వీక్షించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి మ్యాచ్‌ను తిలకించారు. ఆద్యంతం విద్యార్థుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య వీక్షణ కార్యక్రమం కోలాహలంగా సాగింది.

👉 మెస్సీ హైదరాబాద్ పర్యటించి క్రీడారంగంలో నూతన ఉత్తేజాన్ని నింపిన నేపథ్యంలో అట్లాంటా స్టేడియంలో అర్జెంటినా, ఈజిప్ట్ దేశాల జట్ల మధ్య సాగిన మ్యాచ్‌ను ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వీక్షించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటినా 3-2 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది.

👉 ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గత డిసెంబర్‌లో హైదరాబాద్ సందర్శించడమే కాకుండా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రీడాభిమానులను అలరించారు. విద్యార్థులు, క్రీడాభిమానుల్లో స్ఫూర్తిని నింపేందుకు మెస్సీ ఉప్పల్ స్టేడియంలో మైదానమంతా కలియతిరుగుతూ అందరిలో ఉత్సాహాన్ని నింపిన విషయం తెలిసిందే.