👉ప్రభుత్వానికి నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారం !
👉 అన్ని ప్రక్రియలలో అప్రమత్తంగా ఉండండి !
👉 సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం లో అధికారులకు ఆదేశాలు !
J.SURENDER KUMAR,
ఉద్యోగాల నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు (vested interests) రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు.
👉 పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రి కు కీలక సమాచారం అందించాయి.
👉 ఇటీవల విడుదలైన నోటిఫికేషన్కు సంబంధించి నియామక ప్రక్రియను పకడ్బందీగా, పూర్తి పాదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. నియమ నిబంధనలను అనుసరించి ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
👉 ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని ప్రక్రియలలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

👉 ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
👉 అత్యవసర సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ , పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాస రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పాల్గొన్నారు.
