👉 అధికారులకు ఆదేశాలు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
J.SURENDER KUMAR,
కొడంగల్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై హకీంపేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఎంఎన్ కేఎల్ఐఎస్ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా చెప్పారు.
👉మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల #MNKLIS ప్రాజెక్టు ఫేజ్-2 పనులకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడానికి ప్రతి ఏటా అవసరమైన బడ్జెట్కు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు.
👉 నియోజకవర్గంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు. గత సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన సూచనలకు అనుగుణంగా పనుల్లో మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ పనులు ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
👉 ప్రాజెక్టు ఫేజ్-1 పనులను డిసెంబర్ 2027 నాటికి, ఫేజ్-2 పనులను అక్టోబర్ 2028 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.

👉 కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని రోడ్డు భవనాల పనుల పనుల పురోగతిని సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలో రోడ్ కనెక్టివిటీ, భవన నిర్మాణాలు, బ్రిడ్జీలు, ఇతర నిర్మాణాల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
👉 నియోజకవర్గంలో ప్రతి తండాకు రోడ్డు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని, తండాలకు రోడ్డు నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో వాగుల వద్ద కల్వర్టులు, వంతెనల నిర్మాణానికి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని, చెక్డ్యామ్ తరహాలో వాగుల వద్ద బ్రిడ్జిల నిర్మాణం ఉండేలా డిజైన్లు రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.
