కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చెయ్యాలి!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J SURENDER KUMAR,


నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా భవన నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు.


👉 వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటనలో భాగంగా శుక్రవారం  ముఖ్యమంత్రి  ముందుగా మద్దూరులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలేజీ డిజైన్లు, లేఅవుట్‌ను పరిశీలించి పలు మార్పులను సూచించారు.


👉 భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు జరగాలని, కళాశాల చుట్టూ ప్రహారీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణా పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. స్థానికులను పలకరిస్తూ, వారితో కరచాలనం చేశారు.

👉 రెసిడెన్షియల్ పాఠశాల పనుల పరిశీలన !


నారాయణపేట్ జిల్లా మద్దూరులో ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల పనులను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  పరిశీలించారు. పదేళ్ల కిందట ప్రజల అవసరాల కోసం సొంత డబ్బుతో కొనుగోలు చేసిన భూమిని ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించగా, ఆ స్థలంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని చేపట్టారు.


👉 జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రి  పాఠశాల నిర్మాణ ప్రణాళికలను పరిశీలించి ప్రాంగణమంతా కలియతిరిగారు. స్థానికులందరితో మాట్లాడి వారి నుంచి విజ్ఞాపనలను తీసుకున్నారు.


👉 గతంలో భూమి కొనుగోలు చేసిన సందర్భంగా భూములిచ్చిన రైతులను గుర్తించి ముఖ్యమంత్రి  వారితో మాట్లాడారు. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.