అభివృద్ధిలో అధికారులు బాధ్యతతో పనిచేయాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J SURENDER KUMAR,


గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అధికారులు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించే దిశగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

బుధవారం వెల్గటూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ సర్పంచులు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన అభివృద్ధి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీల అవసరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను వంద శాతం పూర్తి చేసిన బీఎల్‌ఓలను మంత్రి సన్మానించి అభినందించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.