👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత స్థానమని, తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఉత్తర భారత ప్రతినిధులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం పెట్టుబడులకు రక్షణగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
👉 సీఐఐ ఉత్తర భారత (CIINR) ప్రతినిధులు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో శుక్రవారం ముఖ్యమంత్రి తో సమావేశమయ్యారు.
👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,…
తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, మంచి ప్రతిపాదనలతో వచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తెలిపారు.
👉 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని తెలిపారు. గత డిసెంబర్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని వివరించారు. తెలంగాణ రైజింగ్ -2047 పాలసీని గ్లోబల్ సమ్మిట్లో ప్రకటించిన విషయాన్ని తెలియజేస్తూ, ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని, అది 10 శాతంగా ఉండాలన్నదే తన లక్ష్యమని వెల్లడించారు.
👉 “తెలంగాణ సంస్కృతి తమకు పెద్ద ఆస్తి అని, హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల ప్రజలున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన దానికి రెట్టింపు ఆదాయం వస్తుంది. పారిశ్రామికవేత్తలు తమకు ఏం కావాలో చెబితే ఆ వసతులు కల్పిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నిత్యం అందుబాటులో ఉంటారు.
👉 పరిశ్రమల శాఖ మంత్రి ప్రతి రెండు నెలలకోసారి, తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తాం. తెలంగాణను మీ సొంత ప్రాంతంగా భావించండి” అని సీఐఐ ప్రతినిధులకు సూచించారు.

👉 దేశంలోని మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగుళూరు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఆ మహానగరాల పరిస్థితులు రావొద్దన్న ఉద్దేశంతో తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్గా మూడు ప్రాంతాలుగా విభజించామని తెలిపారు.
👉 160 కి.మీ. పొడవైన ఔటర్ రింగు రోడ్డు లోపల క్యూర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్గా గుర్తించామని చెప్పారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ప్రాంతాన్ని ప్యూర్గా, ఆ ప్రాంతంలో మాన్యుఫ్యాక్చర్ రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు వెలుపల వ్యవసాయ రంగానికి, అగ్రి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు.
👉 ప్యూర్, రేర్ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు ఇతర వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మించనున్నామని, విభాగాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
👉 వరంగల్, ఆదిలాబాద్లో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు కేంద్రం నుంచి అనుమతి తెలిపిందని, 7 బుల్లెట్ ట్రైన్లను కేంద్రం ప్రకటిస్తే 3 తెలంగాణకు వచ్చాయని గుర్తుచేశారు. శంషాబాద్ నుంచి చెన్నై, శంషాబాద్ నుంచి పూణె, శంషాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయన్నారు.
👉 పొరుగు రాష్ట్రాలతో పోటీ పడదల్చుకోలేదని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడి చైనా ప్లస్ 1 కంట్రీగా తెలంగాణను నిలపడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2037 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు.
👉 “ఏఐ సునామీతో వైట్ కాలర్ జాబ్లు పోతున్నాయని, దాంతో తాము నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాం. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పాం. దానికి ఛైర్మన్గా ఆనంద్ మహీంద్రాను, డైరెక్టర్లుగా కార్పొరేట్ కంపెనీల దిగ్గజాలు ఉన్నారు. దేశంలోనే తమది బెస్ట్ స్కిల్ యూనివర్సిటీ” అని ముఖ్యమంత్రి అన్నారు.
👉 రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్చిన నేపథ్యంలో వాటిల్లో శిక్షణ పొందిన వారికి 100 శాతం ఉద్యోగాలు పొందారని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులనే బోధిస్తున్నామన్నారు. ఇక్కడి జీసీసీల్లో 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని, అమెజాన్ డేటా సెంటర్ల పై ₹ లక్ష కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు. అదాని ₹ 35 వేల కోట్లు డేటా సెంటర్పైన పెట్టుబడి పెడుతోందని ముఖ్యమంత్రి వివరించారు.
👉 ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు , పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య , సీఐఐ నార్తరన్ రీజియన్ చైర్మన్ పునీత్ కౌరా , డిప్యూటీ చైర్మన్ శ్రద్ధా సూరి మార్వా , ప్రతినిధులు కృష్ణ బోధనపు , గౌరవ్ మహేశ్వరి , వనిత దాట్ల , ఉత్తమ్ కుమార్ రెడ్డి , వినోద్ కె బాప్న తో పాటు ఇతర తదితరులు పాల్గొన్నారు.

👉 తెలంగాణ పారిశ్రామిక విధానాలకు ఆకర్షితులమయ్యాం – పునీత్ కౌరా !
“తెలంగాణ పారిశ్రామిక విధానాలు చాలా బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలు, ఇస్తున్న మద్దతుతో జీసీసీలు హైదరాబాద్కు వరుస కడుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. మౌలిక వసతులు, ప్రభుత్వ సహాయ సహకారాలు మెరుగ్గా ఉండడంతోనే సమావేశానికి హైదరాబాద్ను ఎంచుకున్నాం. ఇక్కడ అధ్యయనం చేసేందుకు వచ్చాం.”
