👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు వారికి అవసరమైన పాస్పోర్టు, ఆయా దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్కాం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్టులు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్కాం చేయాలని సూచించారు.
👉 ముఖ్యమంత్రి శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి , ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్య ప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
👉 విదేశీ కంపెనీలతో టామ్కాం ఒప్పందం చేసుకోవడం ద్వారా అక్కడకు వెళ్లిన వారికి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే చర్చలు జరపడానికి, వారికి న్యాయం చేయడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డారు.
👉 “కార్మికులను విదేశాలకు తరలించే ఏజెంట్ల వివరాలు సేకరించి, వారు పంపించే ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేయాలి. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు టామ్కాంకు మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని సీఈవోగా నియమిస్తాం. ఉద్యోగాలకు వెళ్లే వారికి లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్లోనూ శిక్షణ ఇప్పించాలి” అని సూచించారు.

👉 “యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. జర్మన్, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్ తదితర భాషలు నేర్చుకునేందుకు వీలుగా స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలి” అని చెప్పారు.
👉 విదేశీ భాషలు నేర్పేందుకు స్థానికంగా ఆ భాషలో పట్టున్న వారితో పాటు ఆయా దేశాలకు చెందిన శిక్షకులను రప్పించాలని సూచించారు. ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చినట్లే, బ్లూ కాలర్ జాబ్లకు శిక్షణ పొందేవారందరికీ స్కాలర్షిప్లు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
👉 “ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పించాలి. ఓ వైపు చదువుకుంటూనే, మరో వైపు ఇంటర్న్షిప్ చేయడం ద్వారా వారికి స్టైఫండ్ లభిస్తుంది. భవిష్యత్లో చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకుంటారు” అని చెప్పారు.
👉 “ఏటీసీల్లో EV సర్వీసులకు సంబంధించిన కోర్సులు, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలి. ఈవీల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వాటి సర్వీసింగ్ చేయగలిగిన వారు అవసరం. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతున్నందున డ్రోన్ టెక్నాలజీ కోర్సు ఉండాలి” అని సూచించారు.
👉 దేశీయంగానూ, విదేశాల్లోనూ నర్సుల సేవలకు భారీ డిమాండ్ ఉందని ముఖ్యమంత్రి వివరించారు. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో ఇంటికో నర్సు డిమాండ్ ఉందన్నారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.
