గత ప్రభుత్వం సాగునీటి అవసరాలు పట్టించుకోలేదు !

👉 పెండింగ్ లో ఉన్న సాగునీటి పనులు పూర్తి చేస్తాం !

👉 యుద్ధ ప్రాతిపదికను స్తంభంపల్లి చెరువు మరమ్మతు పనులు !


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

గోదావరినది తీరంలో ధర్మపురి నియోజకవర్గంలోని 60 శాతం గ్రామాలు ఉన్నప్పటికీ  గత ప్రభుత్వంలో రైతుల,  సాగునీటి అవసరాలను బీఆర్ఎస్ నాయకులు  పట్టించుకోలేదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం స్థంభం పల్లి గ్రామ చెరువును శనివారం మంత్రి పరిశీలించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధర్మపురి నియోజకవర్గంలోని రైతుల అవసరాలకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని అన్నారు. నియోజకవర్గంలో కీలకమైన రోళ్ళ వాగు ప్రాజెక్టు అంచనాలు పెంచి ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేశారని అన్నారు.  అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కాగితాలకే పరిమితం అయ్యిందని మంత్రి ఆరోపించారు.


👉 రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు.


👉 రోళ్ళ వాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తున్నామని అక్కపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేసి 2027 జనవరి 27 వరకు నీటిని ఎత్తిపోస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్తంభంపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేయడంతో పాటు స్థంభంపల్లి చెరువు మత్తడి మరమ్మత్తు, తుముల వెడల్పు మరమ్మతుకు  ₹ 5 లక్షల కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.


👉 గొల్లపల్లి మండలంలోని యశ్వంతరావుపేట చెరువు పూడికతీత పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మేడారం రిజర్వాయర్ నుండి ముంజంపల్లి, మారేడుపల్లి గ్రామాలకు సాగునీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు.


👉 బొమ్మరెడ్డిపల్లి కొత్తపల్లి వరకు కాల్వ పనులు పూర్తి చేస్తామని నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి వివరించారు.


👉  రహదారిని పరిశీలించిన మంత్రి !


ధర్మపురి మండలంలోని తుమ్మేనాల–నర్సయ్యపల్లె గ్రామాల మధ్య ఉన్న రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ధాటికి కొట్టుకుపోవడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు.


ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఆయన, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే తాత్కాలిక రాకపోకల ఏర్పాట్లు చేయాలని, అనంతరం శాశ్వత మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.