👉 విద్యార్థి యువతకు ఈ ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని అంకితం చేసిన సీఎం !
J.SURENDER KUMAR,
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ను బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు ఈ ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని అంకితం చేశారు.

👉 తెలంగాణలో మొట్టమొదటి ఈ ఆదర్శ పాఠశాలను ప్రారంభించిన తర్వాత ఆవరణ ఆసాంతం తిరిగి పరిశీలించారు. ఇదే సందర్భంగా పాఠశాలల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
👉 ఆ తర్వాత అత్యాధునిక వసతులతో నిర్మించిన పాఠశాల తరగతి గదులు, లైబ్రరీ, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబరేటరీల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను క్షణ్ణంగా పరిశీలించారు. సైన్స్ ల్యాబరేటరీలో వివిధ పరికరాలను చూశారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన బస్సులను పరిశీలించారు.

👉 నృత్యం, సంగీతం బోధించే తరగతి గదులు, డిజిటల్ క్లాసులను సందర్శించారు. వంట గదిని పరిశీలించారు. వంటవారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పూరీ తయారీలో సహకరించారు. ఆవరణలో విద్యార్థులతో ముచ్చటించారు. అధ్యాపకుల కార్యాలయం సందర్శించారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

👉 పాఠశాల ఆవరణలో అత్యున్నత వసతులతో తీర్చిదిద్దిన వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ వంటి క్రీడాస్థలాలు, టెన్నిస్, క్యారమ్స్ హాళ్లను, ఆవరణలోని పార్కులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కొద్దిసేపు సరదాగా ఫుట్బాల్ ఆడారు.

👉 అత్యంత అహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. చాలా మంది విద్యార్థులతో కరచాలనం చేస్తూ ముఖ్యమంత్రి వారిని ఆశీర్వదించారు.
👉 ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సౌకర్యాలు కల్పించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో ఇంగ్లీషులో బోధిస్తారు.

👉 ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి , సలహాదారులు కె. కేశవ రావు , శాసన మండలి చీఫ్విప్ పట్నం మహేందర్ రెడ్డి తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తో పాటు ఇతర సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
